HRF demands comprehensive inquiry into the death of Tahsildar Nagaraju

నాగరాజు మరణంపై సమగ్ర విచారణ జరపాలి.
మానవ హక్కుల వేదిక డిమాండ్

కీసర తహసీల్దారు నాగరాజు మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. జైలు అధికారులు చెపుతున్నట్టు అది ‘ఆత్మహత్య’ అని నమ్మడానికి కుటుంబ సభ్యులే కాదు ప్రజలెవరూ కూడా సిద్ధంగా లేరు. మానవహక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం నాగరాజు కుటుంబ సభ్యులతో, లాయరుతో, జైలు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తో మాట్లాడి తెలుసుకున్న వివరాలు ఇవీ:
నాగరాజు మీద రెండు తీవ్రమైన అవినీతి కేసులు ఉన్నప్పటికీ త్వరలో బెయిల్ మీద బయటకు వస్తాడనే నమ్మకంలోనే అతనూ, అతని లాయరూ, కుటుంబ సభ్యులూ ఉన్నారు. చనిపోయిన రోజు ఉదయం కూడా నాగరాజు తన కుటుంబ సభ్యులతో మామూలుగానే మాట్లాడాడు. అతని మాటల్లో ఎక్కడా నిరాశా నిస్పృహలు ధ్వనించలేదు. అలాంటి పరిస్థితిలో ఎంతో హై సెక్యూరిటీ ఉండే చంచల్ గూడ జైలులో మరో ముగ్గురు ఖైదీలతో కలిసి ఉన్న వ్యక్తి గదిలోని ఎవరికీ మెలకువ రాని విధంగా కిటికీ ఊచలకు తుండుగుడ్డతో ఉరి వేసుకుని చనిపోయాడంటే ఎలా నమ్మడం?పైగా ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో అతని శవాన్ని చూసిన బంధువులకు అతని మెడ మీద ఉరి వేసుకున్న గుర్తులేమీ కనిపించలేదు. మేము కూడా మృతదేహం ఫోటోలు చూసాము. ఆ గుర్తులేమీ లేవు. అంతే కాదు – ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తాను అనుమానిస్తున్నట్టు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన భార్య స్వప్నను ఆ ప్రయత్నం నుండి విరమింప జేయడానికి దబీర్ పురా పోలీసు అధికారులు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చింది? ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్న విషయాలే.
జైలులో జరిగింది కాబట్టి కస్టడీ మరణంగా పరిగణించి మెజిస్టీరియల్ విచారణ ఎలాగూ జరుపుతారు కాని ఈ కేసులో అంతకన్నా పై స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నాగరాజు బెయిల్ మీద బయటకు వస్తే ఎవరి పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉందో, అవి ఎంత పెద్దవారివో, ఆ వ్యక్తులకు ఈ ‘ఆత్మహత్య’తో ఎలాంటి సంబంధం ఉందో నిష్పాక్షికమైన న్యాయవిచారణ జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది.
తీవ్ర అవినీతి ఆరోపణలున్న వ్యక్తి కాబట్టి ‘ఎలా చస్తేనేం’ అనుకోకుండా ప్రజలు ఈ సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ప్రభుత్వం కూడా మరిన్ని అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా సత్వరమే న్యాయవిచారణకు ఆదేశించాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.

వి. బాలరాజ్, జంటనగరాల కార్యదర్శి
ఎస్. జీవన్ కుమార్, వి. వసంత లక్ష్మి
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయ కమిటీసభ్యులు
మానవ హక్కుల వేదిక

Foisting false cases on activist condemned

మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన
15.06.2020.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి నలమాస కృష్ణ ను ఆదివారం, ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ఎన్ ఐ ఎ పోలీసులు అరెస్టు చేశారని కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణపై రాష్ట్ర పోలీసులు ఆరు కేసులు పెట్టారని , ఆరింట్లోను ఆయన బెయిలు పొందాడని కృష్ణ భార్య సంధ్య తెలిపింది. ఆయన కిడ్నీ ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఖమ్మం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా ఆదివారం నాడు ఎన్ ఐ ఎ పోలీసులు వారెంట్ కాగితం ఇచ్చి ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ ను, ఈ సమయంలో అరెస్టు చేయటం ఆయన ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా అని ఆమె ఆందోళన చెందుతున్నది.
వివిధ ప్రజా సంఘాలకు చెందిన 11 మంది కార్యకర్తలు ఇప్పటికే జైలులో ఉన్నారని, అందులో ముగ్గురికి బెయిల్ లభించిందని, మొత్తం 78 మంది పై కేసులు పెట్టడానికి రాష్ట్ర పోలీసులు జాబితా తయారు చేసి పెట్టుకున్నారని ప్రజా ఫ్రంట్ ప్రతినిధులు మా సంస్థకు తెలిపారు.
ప్రత్యామ్నాయ రాజకీయ అభిప్రాయాలు కలవారిపై , పాలకులకు రుచించని భావాలను ప్రకటిస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నది. ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్దమైన వైఖరిని మా సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వంలోని పెద్దలే కాదు, ప్రజా ప్రతినిధులందరూ బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రజా సంఘాల కార్యకర్తలకు బెయిల్ విషయంలో , వాళ్ళ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయించడంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయ పడాలని మేం కోరుతున్నాం. అరెస్టు చేసిన నలమాస కృష్ణను వెంటనే విడుదల చేయాలని, ప్రజాసంఘాల కార్యకర్తలు చట్టబద్దంగా పని చేసుకునే హక్కును అణచివేయవద్దని మా సంస్థ డిమాండ్ చేస్తున్నది.

1, ఎస్ జీవన్ కుమార్
( మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యులు)

2, గొర్రెపాటి మాధవరావు
( HRF రాష్ట్ర అధ్యక్షులు)

3, డాక్టర్ ఎస్ తిరుపతయ్య
(HRF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)