ప్రజా చైతన్యం పై ‘ఉపా’ దాడి (ఆంధ్రజ్యోతి, 25.06.2024)

అరుంధతి రాయ్, షేక్ షాకత్ హుస్సేన్ (కశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్) పైన పద్నాలుగేళ్ళ క్రితంనాటి ఆరోపణలను సాకుగా చూపిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఊపా అనే అనాగరిక చట్ట ప్రయోగానికి అనుమతిచ్చారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న, ప్రజాస్వామ్య సంస్కృతి కోసం ఆరాటపడే గొప్ప మానవీయ రచయిత్రి అరుంధతి రాయ్ పైన ఊపా కేసు ప్రయోగంతో కేంద్రంలోని ప్రభుత్వం తన అంతిమ ఫాసిస్టు రూపాన్ని ప్రదర్శిస్తున్నది.

2010లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వక్తలు చేసిన ఉపన్యాసాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగానూ, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేవిగానూ ఉన్నాయని ఒక కశ్మీరీ పండిట్ ఆనాడు ఫిర్యాదు నమోదు చేశారు. ఆనాటి కేసును తిరగదోడి గత సంవత్సరం ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఇవాళ వాటినే ఊపా కేసు పరిధిలోకి తెచ్చారు. ఊపా ఎంత అనాగరిక చట్టమైనా దాని ఉద్దేశం కొంతమంది వ్యక్తులు లేదా సంస్థల వల్ల భవిష్యత్తులో హింస లేదా నేరాలు జరగకుండా నివారించటమే. నిజంగా ఈ ప్రముఖుల ఉపన్యాసాల వల్ల కశ్మీరీ ప్రజలు రెచ్చిపోయి ఉంటే, వేర్పాటువాదం మరింత పెరిగిపోయి ఉంటే ఆ పర్యవసానాలు వారి ఉపన్యాసాలనంతరం కనిపించేవి. ఫలితంగా జరిగిన పరిణామాలకు వీరి ఉపన్యాసాలను లింక్ చేసి ఉంటే అదొక చట్టబద్ద వ్యవహారమై ఉండేది. నిజానికి, అటువంటి ఉపన్యాసాలు వారేమీ ఇవ్వకపోయినా, ఇచ్చిన ఉపన్యాసాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా, వీరిపై ఆరోపణలు చేసిన వ్యక్తి దురుద్దేశంతో ఫిర్యాదు చేశాడని ఆ కేసును అంతటితో మూసివేయవచ్చు.

అరుంధతీ రాయ్ లాంటి వ్యక్తులు కాశ్మీర్ ప్రజల సామాజిక, రాజకీయ, రాజ్యాంగ హక్కుల విశ్లేషణ తప్ప మతోన్మాదుల లాగా జనాన్ని రెచ్చగొట్టే చవకబారు ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇచ్చే బాపతు కాదు. ఆ విషయాలు తెలిసి కూడా నిత్యం ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ, వారిలో భావోద్రేకాలను రెచ్చగొట్టి, చట్టబాహ్య హింసకు కారణమైన చరిత్ర గల రాజకీయ పార్టీ ఇవాళ అధికార పీఠంపై కూర్చుని శాంతి కోసం తపిస్తున్నట్లు నిజమైన శాంతికాముకులైన ప్రజాస్వామ్యవాదులపై ఇటువంటి కేసులకు దిగుతున్నది. ఫాసిస్ట్ స్వభావం గల అధికార పార్టీ, వారి సోదర, మాతృ సంస్థల బండా రాన్ని బట్టబయలు చేస్తూ అరుంధతి రాయ్, ఇంకా అనేకమంది జాతీయ స్థాయి ప్రజాస్వామిక వాదులు ప్రజలను చైతన్యం చేయటాన్ని సహించలేని ప్రభుత్వం రాజకీయంగా, సైద్దాంతికంగా వారిని ఎదుర్కోలేక ఇటువంటి నిరంకుశ అణచివేతకు దిగుతున్నది. ప్రజలు క్రమంగా పాలకుల ప్రజావ్యతిరేక, ఫాసిస్టు స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నారు. వారు మరింత చైతన్యం కాకుండా నిరోధించటానికే అరుంధతీ రాయ్ పైన ఈ ఊపా కేసు.

ఫాసిజం స్వభావసిద్ధమైన లక్షణం సమాజంలోని చైతన్యాన్నీ వివేకాన్నీ చంపి వేయటం. అందుకే వాళ్లు ప్రజలను చైతన్యం చేసే రచయితలనూ, మేధావులనూ, కమ్యూనిస్టులనూ, చైతన్యానికి వేదికలుగా ఉండగల విశ్వవిద్యాలయాలనూ లక్ష్యంగా చేసుకొని మొట్టమొదట దాడి చేస్తారు. గత పదేళ్ళుగా దేశంలో అదే జరుగుతున్నది. అదే క్రమంగా ఉదృతమవుతున్నది. ఆధునిక నాగరికతకూ, ప్రజాస్వామ్యానికీ, మానవాళి గౌరవప్రద జీవనానికీ గొడ్డలి పెట్టులాగా మారిన ఫాసిస్ట్ పరిపాలనా ధోరణి భారతదేశంలో జడలు విప్పుతున్నది. అందరం ఒక్కటై ప్రజాస్వామ్యాన్నీ, భావప్రకటనా స్వేచ్ఛనూ కాపాడుకుందాం. అరుంధతి రాయ్, షేక్ షాకత్ హుస్సేన్ లపై ఊపా ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం.

డాక్టర్ ఎస్. తిరుపతయ్య

25.06.2024
ఆంధ్రజ్యోతి

Related Posts

Scroll to Top