జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరుల, కార్యకర్తల కేసులను సమీక్షించి, వారిని విడుదల చేయాలి
గత ఏడాది కాలంలో చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న సుమారు 2,500 మంది, అందులో దళ సభ్యులు మరియు నాయకులు అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి లొంగుబాట్లను స్వీకరించి, వారిని తిరిగి సామాజిక జీవితంలోకి తీసుకురావడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా ఆయా ప్రభుత్వాలు సమీక్షస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ సభ్యులు కాకపోవచ్చు. కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణల తో జైళ్లలో ఉన్నారు.









