రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడకండి
చెంగిచెర్ల సంఘటన హిందూత్వ రాజకీయాలకు ఒక ఉదాహరణ. ‘మందిర్ వహీ బనా దేంగే’ పాట హిందుత్వ పాప్ గా చలామణీలోకి తీసుకు వచ్చేసారు. అప్పుడయినా ఇప్పుడయినా హిందూత్వ విధానంలో మార్పు లేదు. ఒక వర్గాన్ని క్రూరులుగా చూపాలంటే, చరిత్రలో వారి పూర్వీకుల క్రూరత్వాన్ని మర్చిపోనివ్వకుండా చేస్తూ, జరిగిన చరిత్రకు కొంత మసాలా జోడించి ప్రజల్లో చరిత్ర పట్ల అవగాహనను మారుస్తూ, ఆ వర్గాన్ని రెచ్చగొట్టి, అదిగో రెచ్చిపోయారు, ఇలా క్రూరత్వం అనేది వీరి రక్తంలోనే ఉందని ఎదురు ప్రచారం చేస్తూ, ఈ క్రూరుల నుంచి నేనే నిన్ను కాపాడతాను కాబట్టి నాకే ఓటు వెయ్యండి అని అడగడమే ఆ విధానం. దశాబ్దాలుగా భారతదేశంలోని హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టిన బాబ్రీ – అయోధ్య తగాదా తమకే అనుకూలంగా పరిష్కరించబడడంతో హిందుత్వవాదులు దాన్ని ఒక ఘనవిజయంగా చూస్తున్నారు, చూపిస్తున్నారు. నేను గెలిచాను అని చాటింపు వేసుకుంటూ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు.