చిత్తూరు పట్టణంలో యాస్మీన్ భాను మరణానికి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయాలి

చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణంలో షేక్ యాస్మీన్ భాను మరణానికి సంబంధించిన కేసులో షేక్ మొహమ్మద్ లాలు, ఒక మైనర్ ల మీద హత్య, హత్యకు కుట్రకి సంబంధించిన సెక్షన్లు నమోదు చేయాలని, యాస్మీన్ మరణంలో తన తండ్రి షేక్ షౌకత్ ఆలీ పాత్ర గురించి చిత్తూరు పోలీసులు పారదర్శక విచారణ చేపట్టాలని మానవ హక్కుల వేదిక (HRF), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) డిమాండ్ చేస్తున్నాయి.

ఏప్రిల్ 13, 2025 నాడు యాస్మీన్ భాను అనుమానస్పద పరిస్థితులలో మరణించింది అని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. ఐతే ఇది హత్య అని భాను భర్త దళిత వర్గానికి చెందిన తాళ్ళ సాయి తేజ, ఇతరులు ఆరోపించిన నేపథ్యంలో నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక, సిపిఎం బృందం ఈ రోజు సాయి తేజ, తన కుటుంబసభ్యులు, చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారిని కలిసి నిజ నిర్ధారణ జరిపింది.

ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కళాశాల నాటి నుండి సాయి తేజ (27) , భాను (25) ప్రేమించుకుంటున్నారు. ఇది భాను కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీనితో వారిద్దరూ ఫిబ్రవరి 5, 2025 నాడు వెళ్ళిపోయి, ఫిబ్రవరి 9 నాడు నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తరువాత పూతలపట్టు మండలం పోటుకనుమ గ్రామంలో సాయి తేజ ఇంట్లో ఉంటున్నారు. ఫిబ్రవరి 5 నుండి 9 మధ్యలో యాస్మీన్ బంధువులు అయిన షేక్ మొహమ్మద్ లాలు, ఇతరులు పోటుకనుమ గ్రామంలో, సాయి తేజ ఇండి దగ్గర గొడవ చేశారు. పెళ్లి అయిన అప్పటినుండి భాను కుటుంబసభ్యులు భానును ఇంటికి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ఐతే తను నిరాకరించింది.

ఆ తరువాత తన నాన్న గారికి బాగోలేదు అని, కూతురిగా తను వచ్చి చూడాలి అని ఒత్తిడి చేయసాగారు. విపరీతమైన ఒత్తిడి నేపథ్యంలో కలవటానికి ఒప్పుకుంది. ఏప్రిల్ 13 నాడు సాయి తేజ తనని చిత్తూరు లోని పి సి ఆర్ సర్కిల్ దగ్గర దించగా, స్కార్పియో కారులో (AP 04 AC 444) వచ్చిన షేక్ మొహమ్మద్ లాలు, ఇంకొకరు ఎక్కించుకుని వెళ్లారు. ఆ తరువాత భానుని సంప్రదించడానికి సాయి తేజ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొన్ని సార్లు ప్రయత్నించాక తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని, తన శవం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ లో ఉంది అని భాను అక్క సాయి తేజ కి చెప్పింది. తన ఆత్మహత్యకి సంబంధించి తన తల్లి ముంతాజ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. (క్రైమ్ సంఖ్య. 55/2025, తేదీ: 13.04.2025).

ఐతే ఈ ఆత్మహత్య కథలో అనేక లొసుగులు ఉన్నాయి. ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదులో షౌకత్ ఆలీ భానుని ఇంటికి తీసుకొచ్చారు అని ఉంది. ఐతే ఆ కారులో తను లేరు అనేది సాక్షులు చెబుతున్నది.

అలాగే ఆత్మహత్య చేసుకున్నప్పుడు శరీరంలో సంభవించే మార్పులు. పిడికిలి బిగించి ఉండటం, గుడ్లు తేలేయడం, నాలుక మడత పడి ఉండటం లాంటివి ఏమీ ఇక్కడ లేవు. అదే కాక తను చనిపోయిన మరుక్షణం నుండి తన తండ్రి అదృశ్యమయ్యారు. కనీసం ఫోను కూడా తీసుకువెళ్ళలేదు. అలాగే లాలు, మరొకరు కూడా తమ ఫోనులు తీసుకువెళ్ళకుండా అదృశ్యమయ్యారు. ఒక తండ్రి తన కూతురు చనిపోతే కనీసం ఫోను కూడా తీసుకువెళ్లకుండా అదృశ్యమవుతారా? ఇది అనేక అనుమానాలకు తావిస్తున్నది.

ఇక్కడ అనేక ప్రశ్నలు ఉన్నాయి. పోలీసుల విచారణ కూడా నెమ్మదిగా ఉంది. ఈ కేసుకు సంబంధించి రెండు వర్గాలు కూడా అణగారిన వర్గాలే. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని, సమస్యలు సృష్టించాలి అని అనుకువే ఇంకొక వర్గం ఉంది..అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి, యాస్మీన్, సాయి తేజ లకి న్యాయం చేకూర్చడానికి పోలీసుల విచారణ పారదర్శకంగా ఉండాలి.

దీనికి సంబంధించి జిల్లా ఎస్ పి విజయ మణికంఠ గారిని కూడా కలవటం జరిగింది. తాము త్వరితగతిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

కావున, ఈ కేసుకు సంబంధించి షేక్ మొహమ్మద్ లాలు, అతనితో ఉన్న మైనర్ మీద హత్య, హత్యకు కుట్ర కింద సెక్షన్లు నమోదు చేయాలని, తండ్రి పాత్ర మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

ఈ నిజ నిర్ధారణలో మానవ హక్కుల వేదిక చిత్తూరు జిల్లా కన్వీనర్ కె. మదన శేఖర్, సి పి ఎం జిల్లా కార్యదర్శి వి. గంగరాజు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి. రోహిత్, జిల్లా ఎస్ సి/ ఎస్ టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వి. రాజ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు ఎం. నాగరాజు పాల్గొన్నారు.

కె. మదన శేఖర్ (HRF చిత్తూరు జిల్లా కన్వీనర్)
వి. గంగరాజు (సి పి ఎం జిల్లా కార్యదర్శి)
వి. రాజ్ కుమార్ (జిల్లా ఎస్ సి/ ఎస్ టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు)
ఎం. నాగరాజు (సీనియర్ పాత్రికేయులు)
జి. రోహిత్ (HRF రాష్ట్ర కార్యదర్శి)

చిత్తూరు,
16.04.2025

Related Posts

Scroll to Top