వక్ఫ్ చట్ట సవరణల పేరుతో రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి
ల్యాండ్ మాఫియాకు మేలు చేసే ఈ చట్ట సవరణలు రద్దు చేయాలి – మానవ హక్కుల వేదిక
రాజ్యమే ఒక మత సంస్థ ఆస్తులను కబ్జాలు చేసుకునేలా ప్రోత్సహిస్తూ చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 ని వెంటనే రద్దు చేయాలి. అందులో సమానత్వ, మత స్వాతంత్ర్య హక్కులను ఉల్లంఘించే నిబంధనలు ఉన్నాయి. అంతేగాకుండా ఇది వక్ఫ్ ఆస్తులను కబ్జాదారులకే సొంతం చేయడానికి దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మసీదులు, దర్గాలు, ముస్లింల స్మశాన వాటికల వద్ద అల్లర్లు సృష్టించే అవకాశాలను ఈ చట్టంలోని సవరణలు కల్పిస్తున్నాయి. ఏకపక్షంగా ముస్లిం మైనారిటీల ఉనికినే ప్రశ్నిస్తున్న ఈ చట్ట సవరణలు రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడిగా పరిగణిస్తున్నాం. పార్లమెంట్ కు చట్ట సవరణలు చేసే అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే అధికారం లేదని పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు చెప్పిన విషయాలు విదితమే. వక్ఫ్ చట్టంలోని ఆరు నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.
వక్ఫ్ చట్ట సవరణలపై మేము గుర్తించిన అభ్యంతరకరమైన ఆరు అంశాలు:
1. ముస్లిమేతర వ్యక్తులను నియమించడం: వక్ఫ్ బోర్డులలో లేదా నిర్వహణ కమిటీలలో ముస్లిమేతరులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టంలోని సెక్షన్ 9 మరియు 14 సవరణను రద్దు చేయాలి. పాత పద్దతిని అమలు చేస్తూ మహిళలను మరింత ఎక్కువ సంఖ్యలో సభ్యులుగా చేర్చే సవరణ చేయాలి. ఇతర ధార్మిక సంస్థల మాదిరిగానే దీనిని కూడా చూడాలి.
2. వినియోగం ద్వారా వక్ఫ్ (Waqf by User) ని గుర్తించే సెక్షన్ – 40ని రద్దు అన్యాయం: ‘ఒకసారి వక్ఫ్ అయితే ఎల్లప్పటికీ వక్ఫే’ (Once a Waqf always a Waqf) అన్న నిబంధనను బలపరుస్తూ చట్టం అమల్లోకి రాకముందు నిర్మితమై ఉన్న అన్ని దర్గాలు, మందిరాలు, స్మశాన వాటికలు వక్ఫ్ గా గుర్తించాలని వక్ఫ్ చట్టం, 1995లోని సెక్షన్ 40 చెబుతుంది. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఈ చట్టం తీసుకువచ్చి మైనారిటీ మత సంస్థలను కాపాడుతూ వచ్చారు. కానీ తిరిగి ఈ నిబంధనను తొలగించడం ద్వారా దేశంలో కొన్ని శక్తులు పని గట్టుకుని వక్ఫ్ పరిధిలోని ఆస్తులు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేసే అవకాశం ఉంది. తక్షణమే ఈ సవరణను రద్దు చేసి సెక్షన్ 40 ని పునరావృతం చేయాలి. అంతేగాకుండా 12 వ శతాబ్దం నుండి వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వాటికి ఇప్పుడు కాగితాలు చూపించండని అడగడం పూర్తి అసంబద్ధం.
3. సెక్షన్ – 107 ను యధావిధిగా ఉంచాల్సిందే: సెక్షన్ 107 వక్ఫ్ ఆస్తుల విషయంలో కాలపరిమితిని (లిమిటేషన్ పీరియడ్) నిర్దేశిస్తుంది. ఈ సెక్షన్ ని ఎత్తివేయడం వల్ల, ఇప్పటికే 12 ఏళ్లకు పైగా కబ్జాదారుల ఆధీనంలో ఉన్న వక్ఫ్ స్థిరాస్తుల విషయంలో వక్ఫ్ బోర్డు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం పోతుంది. ఆ ఆస్తులు కబ్జాదారులకే సొంతం అవుతాయి. ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ లో ఇతర మత, ధార్మిక సంస్థలకు వర్తించే ఈ మినహాయింపును వక్ఫ్ ఆస్తులకు మాత్రం వర్తించకుండా చేయడం, మైనారిటీల పట్ల వివక్ష చూపడమే.
4. కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం: వక్ఫ్ ఆస్తుల విషయంలో కలెక్టర్లకు అధిక అధికారాలు ఇవ్వడం సరికాదు. ఇది వక్ఫ్ బోర్డు యొక్క స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుంది. ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. వక్ఫ్ వ్యవహారాలను ముస్లిం సంస్థలే స్వతంత్రంగా నిర్వహించేలా చూడాలి. వక్ఫ్ కు ఇది వరకు ఉన్న అధికారాలు యధావిధిగా ఉంచాలి.
5. ముస్లింలు మాత్రమే వక్ఫ్ చేయాలన్న నిబంధన: అది కూడ దానం చెసే నాటికి ఐదేళ్ళ పూర్వం నుండీ ముస్లిం మతాన్ని అనుసరిస్తూ ఉండాలనే ఈ నిబంధన దుర్మార్గమైనది. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్చపై ప్రత్యక్ష దాడి. తమ ఆస్తిని ఎవరికి దానం ఇవ్వాలో ప్రభుత్వాలు నిర్ణయించడం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి నిబంధనలు రాజ్యాంగ స్పూర్తికి విరుధ్దం. గతంలో హిందూ రాజులు కూడా వక్ఫ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ముస్లిం రాజులు కూడా హిందూ దేవాలయాలకు భూములు ఇచ్చిన చరిత్ర మన దేశంలో ఉంది.
6. ఆడిటింగ్ అధికారాల బదలాయింపు: వక్ఫ్ బోర్డ్ ఆడిటింగ్ అధికారాలను రాష్ట్రాల నుండి కేంద్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది రాష్ట్రాల అధికారాన్ని కుదించడమే.
ఈ పై అంశాలను తక్షణమే రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.
కె.వి. జగన్నాధరావు – మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
వై. రాజేష్ – మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విశాఖపట్నం,
22-04-2025